గత జూలై నెలలో జరిగిన శాన్ సెబాస్టియన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించేనిమిత్తం రాష్ట్రపతి రజతపతకాన్ని పొందిన శంభూఫిలింస్ వారి 'నమ్మినబంటు' చిత్రాన్ని స్పెయిన్ కు పంపేముందుగా, భారత ప్రభుత్వపు విదేశాంగ వ్యవహారాల శాఖవారు చిత్రంనిడివిని 18 వేల అడుగులనుంచి 9 వేల అడుగులకు కుదించారు. ఈ సంక్షిప్తప్రతిని క్రిందటి మంగళవారం నాడు నవయుగ ఫిలింస్ వారు విజయవాడలోని అలంకార్ థియేటర్ లో ప్రతికలవారికి ప్రత్యేకంగా చూపించారు.
నిర్మాతలు : పి. సూరిబాబు, కె. నాగుమణి; దర్శకుడు : కె. కామేశ్వరరావు; కథ, మాటలు-పాటలు : పింగళి నాగేంద్రరావు; సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు; నృత్యం : పసుమర్తి కృష్ణమూర్తి, వెంపటి సత్యం; కళ : గోఖలే; నేపధ్యగానం : ఘంటసాల, మాధవపెద్ది, పి. లీల, సుశీల, జిక్కి, జయలక్ష్మి, రాణి; నటీనటులు : నాగేశ్వరరావు, యస్.వి. రంగారావు, రేలంగి, సి.యస్.ఆర్, లింగమూర్తి, సూరిబాబు, కె.వి.యస్. శర్మ, వంగర, శ్రీరంజని, రాజసులోచన.
ఆధునిక ధర్మ ప్రచండ వాయుధాటికి సనాతన ధర్మ మహావృక్షం కూకటి వ్రేళ్ళతో ప్రెల్లగిలి కూలకమానదు. క్షణక్షణం పరిణతి చెందడం ప్రకృతి ధర్మం. రాజ్యాలూ, మతాలూ, ధర్మాలూ, సంప్రదాయాలూ అన్నీ కాలప్రవాహపు వడిలో కొట్టుకొనిపోయే గడ్డిపరకలు. నిత్యనూతన స్వభావం ఒకటే సుస్ధిర సత్యం. ఈ సత్యానికి తలవంచక ధిక్కరించాలనుకోవటం భగవంతునితో కుస్తీ పట్టాలనుకోవటమే అవుతుంది. లొంగకపోతే మెడపట్టి లొంగదీస్తుంది కాల ధర్మం. ఇదే 'నిత్యకళ్యాణం పచ్చతోరణం'లోని మూలవస్తువు.
వసంతోత్సవ వినోదాలలో నిమగ్నులై ఉండగా మహారాజును దుండగులెవరో హత్య చేశారు. గురుకులంలో విద్యా భ్యాసం ముగించి రాజధానికి తిరిగి రానున్న యువరాజుకు ఈ విషయం తెలిసింది. ఆ రాత్రే యువరాజుపై కూడా హత్యా ప్రయత్నం జరిగింది. దుండగులను పరిమార్చి రాజధానికి తిరిగి వస్తూ దారిలో స్పృహతప్పి పడిపోతాడు. ప్రమీల అనే అందమైన అమ్మాయి బండి మీద పాటపాడుకుంటూ వచ్చి యువరాజును చూసి ప్రేమించి సేదతీర్చుతుంది. బండిలో రాజధానికి చేరవేస్తుంది. రాకుమారుడు తనకు నా అన్న వాళ్లెవరూ లేరనీ పరదేశిననీ ఆమెతో చెప్తాడు.
జవం గల కథ, జీవం గల పాత్రలు, నిర్దుష్టమైన సన్నివేశాల చిత్రీకరణతో సగటు తెలుగు సాంఘిక చిత్రాల అవధిని అధిగమించింది సారథి స్టూడియోస్ వారి 'కులదైవం'. భారతీయ ఉమ్మడి కుటుంబాలలో సహజమైన ఆనందం, విషాదం, ఉల్లాసం, కల్లోలం, అనురాగం, అసూయ, ఆప్యాయత, అపోహ, పశ్చాత్తాపం సమపాళలో మేళవించుకుని, భారత సంప్రదాయమంత నిండుగా, నిరాడంబరంగా ఉంది. 'కులదైవం'. 16 వేల పైచిలుకు నిడివిలో ఒక్క అడుగైనా ప్రేక్షకులకు విసుగు పుట్టించకుండా, అడుగడుగునా సానుభూతిని చూరగొన్నది.
వేంకటేశ్వర మాహాత్మ్యం వంటి భారీ పౌరాణిక చిత్రాన్ని నిర్మించటం సామాన్యుల వల్లనయేది కాదు. డబ్బూ, ఓపిక, సామర్థ్యం అన్నీ కావాలి. 'ఇవన్నీమాకున్నాయి, మేము సామాన్యులం కాము' అని నిరూపించారు ఈ చిత్ర నిర్మాత, దర్శకుడూ. చాలా రోజులుగా ఎదురుచూస్తూన్న అశేష ప్రజానీకం ఆశించిన దానికన్నా రవంత ఉన్నత ప్రమాణంలోనే ఉంది చిత్రం. పౌరాణిక చిత్రం నవ్వులపాలు కాకుండా తీసి మెప్పించటం ఎంత కష్టమో తెలిసినవారికి ఈ చిత్రం ఇంతకంటే చక్కగా నిర్మించడం తెలుగు సీమలో ఎవరికీ చేతకాదని తెలుస్తుంది. తెలుగు చిత్ర రంగంలో ఇన్నాళ్ళనుంచీ ఆనవాయితీగా వస్తున్న పౌరాణిక ధోరణిలోనే ఉన్నా, కథ అందరికీ సుపరిచితమే అయినా దాన్ని చెప్పడంలో దర్శకుడు చూపిన ప్రతిభవల్ల, చిత్రం ఎంత పొడుగువున్నా చూడక తప్పింది కాదు. చిత్రంలో పౌరాణిక కథ ముగిసిన తరువాత, స్వామివారి ఉత్సవాలు, ఊరేగింపులూ, తీర్థ ప్రజలు, స్వామి వారి పవ్వళింపుసేవ మున్నగునవి అన్నీ డాక్యుమెంటరీ లా చూపారు.
Copyright © 2021 nanduri.com | All Rights Reserved | Site designed and maintained by CodeRhythm Works